సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య

  • సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన 
  • మాజీ సర్పంచ్ చింతలపాటి మధు హత్య 
  • పాత రాజకీయ కక్షలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
  • గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
మధును గ్రామంలోనే హత్య చేసి, మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి మూడు గోనె సంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేసి దుండగులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

గ్రామంలో పాత రాజకీయ వైషమ్యాలే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈ ఘటనతో యర్కారం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.  

Chintalapoti Madhu
Suryapet district
BRS leader
Yarkaram village
Political murder
Middhe Ravinder
Telangana politics
Crime news

More Telugu News